శ్రీశైల దేవస్థానంలో రూ.215.4 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister Satyanarayana) బుధవారం శంకుస్థాపన చేశారు. రూ. 75 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్(Que Complex) నిర్మాణం, రూ. 52 కోట్టతో 200 గదుల యాత్రికుల వసతి సముదాయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.35 కోట్లతో శివసేవకుల వసతి గృహ నిర్మాణం, రూ.7కోట్లతో ఒక మెగా వాట్ సోలార్ పవర్ ప్లాంట్(Solar Power Plant) నిర్మాణం, రూ.5.85 కోట్లతో దేవస్థానం ఉద్యోగుల నివాస సముదాయినికి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, సబ్స్టేషన్(Sub Station)కు మంత్రి శంకుస్థాపన చేశారు.
రూ.5.50 కోట్లతో హేమారెడ్డి మల్లమ్మ మందిరం నుంచి డంపింగ్ యార్డ్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం, రూ.2.60 కోట్లతో వెయ్యి కి.లీ వాటర్ స్టోరేజీ రిజర్వాయర్ నిర్మాణం, రూ.2 కోట్ల వ్యయంతో హటకేశ్వరంలో 500 కి.లీ వాటర్ స్టోరేజ్ రిజర్వాయర్ నిర్మాణం, రూ. 1.60 ఫిల్టర్ బెడ్ ఏరియాలో 500 కి.లీ వాటర్ స్టోరేజ్ రిజర్వాయర్ నిర్మాణం, రూ.1.98 కోట్లతో దోర్నాలలో కల్యాణమండపం నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
రూ. 1.26 కోట్లతో దోర్నాలలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, రూ.99 లక్షలతో అమ్మవారి ఆలయంలో ఉత్తర సాలుమండపాల పునఃనిర్మాణం, రూ. 86 లక్షలతో పంచమఠా కంచె నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.