తిరుపతి : శ్రీనివాస సేతు మూడవ దశ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుమల, తిరుపతి దేవస్థానం ఈవో(Ttd EO) ధర్మారెడ్డి సంబంధి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం టీటీడీ పరిపాలన భవనంలో తిరుపత మున్సిపల్ కమీషనర్ కుమారి అనుపమ అంజలితో కలిసి సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న దాదాపు ఆరు స్టీల్ గర్డర్ లను రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని ఏప్రిల్ 15వ తేదీ లోపు అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
రామానుజ సర్కిల్(Ramanuja circle) నుంచి రేణిగుంట వైపు, తిరుచానూరు మార్కెటింగ్ యార్డ్ వరకు ఉన్న శ్రీనివాస సేతు(Srinivasa setu) పనులను మార్చి 15వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు. శ్రీనివాస సేతు పనులు ఇప్పటికే 89 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా మే 15వ తేదీ లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పాదాచారులు నడిచేందుకు అనువుగా పేవ్ మెంట్ , కాలువలను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు.
సుబ్బలక్ష్మి సర్కిల్ వద్ద పచ్చదనం పెంపొందించాలని, అవసరమైన చోట్ల పెయింటింగ్ తదితర పనులపై ఈవో సమీక్షించారు.ఈ సమావేశంలో జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎఫ్ఎ అండ్ సీ ఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు, మున్సిపల్ ఎస్ఇ మోహన్, అధికారులు పాల్గొన్నారు.