అమరావతి : వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు తిరుమలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని మాడవీధుల్లో స్వర్ణరథంపై ఊరేగించారు. అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు
శ్రీ మలయప్పస్వామివారిని స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగించారు.
ఈ రథోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, తదితర ప్రముఖులు పాల్గొని స్వర్ణరథాన్ని లాగారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవను నిర్వహిస్తున్నారు. అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో కలిసి తిరుచ్చిపై మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర ముక్కోటి తిరుమలలో ఏకాంతంగా జరుపనున్నారు. శ్రీవారి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంతోపాటు, ప్రధాన కూడళ్లలో విద్యుద్దీకరణ పనులను చేపట్టారు.