ఒంటిమిట్ట: ఆంధ్రప్రదేశ్లోని కడప (Kadapa) జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట (Vontimitta) కోదండ రామాలయంలో (Kodanda Ramalayam) నేడు వైభవంగా సీతారాముల కల్యాణం (Seetha Rama kalyanam) జరుగనుంది. బుధవారం రాత్రి వెన్నెల కాంతుల్లో కోదండరాముడి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది. ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి లేదా టీటీడీ చైర్మన్.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వేడుకను తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలిరానున్నారు.
దీంతో 52 ఎకరాల విస్తీర్ణంలో కల్యాణ వేదికను ఏర్పాటు చేశారు. పండువెన్నెల్లో రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కల్యాణాన్ని నిర్వహించనున్నారు. పురాణాల ప్రకారం చతుర్దశి, పున్నమి రోజు చంద్రుడు వీక్షించేలా శ్రీరాముడు రాత్రి సమయంలో కల్యాణం చేసుకుంటారని వేదపండితులు వెల్లడించారు. సాయంత్రం కాంతకోరిక పేరుతో కార్యక్రమం నిర్వహించే పండితులు.. ఎదుర్కోలు ఉత్సవంలో భాగంగా సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరిస్తారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపు నిర్వహిస్తారు. 11వ శతాబ్దం నుంచి ఒంటిమిట్టలో కోదండరాముడికి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. కాగా, షెడ్యూల్ ప్రకారం సీతారాములకు ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉన్నది. అయితే ముఖ్యమంత్రి కాలు బెనకడంతో వైద్యుల సూచనమేరకు ఆయన తన పర్యటనను రద్దుచేసుకున్నారు.