తిరుపతి : పవిత్ర ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం శ్రీ గోదా కల్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 250 కేంద్రాల్లో నెల రోజుల పాటు ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించారు. ముందుగా శ్రీ గోదాదేవి(ఆండాళ్), శ్రీరంగనాథస్వామివారి ఉత్సవర్లను వేదికపై ఉంచి శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు.
వేద పారాయణదారుల వేద పఠనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గాత్ర సంగీతం, నృత్యాల నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది.
అన్నమాచార్య కళామందిరంలో ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు
టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబరు 17 నుంచి దాదాపు నెల రోజుల పాటు జరిగిన తిరుప్పావై ప్రవచనాలు శనివారం ముగిశాయి. తిరుపతికి చెందిన ప్రముఖ పండితులు చక్రవర్తి రంగనాథన్ తిరుప్పావై ప్రవచనాలు వినిపించారు.