Srisailam | లోక కల్యాణం కోసం మంగళవారం ఉదయం శ్రీశైల ఆలయ ప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణస్వామి (కుమారస్వామి)కి అర్చకులు, వేద పండితులు విశేష పూజలు చేశారు. ప్రతి మంగళవారం, కృతికా నక్షత్రం, షష్టి తిథి రోజుల్లో శ్రీసుబ్రహ్మణ్యస్వామికి ఈ విశేష అభిషేకం, పూజాధికారులు నిర్వహిస్తున్నారు. కుమార స్వామికి పూజలతో లోక కల్యాణంతోపాటు ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహ పీడలు, ద్రుష్టి దోషాలు తొలగిపోతాయి. సంతానం కోసం పూజలు చేసే వారికి తప్పక సంతాన భాగ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీసుబ్రహ్మణ్యస్వామికి అభిషేకానికి ముందు దేశమంతా శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి, వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరక్కుండా ఉండాలని, జనులంతా సుఖ శాంతులతో ఉండాలని అర్చకులు, వేద పండితులు సంకల్పం పఠించారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేందుకు మహా గణపతి పూజ చేశారు. అటుపై శ్రీసుబ్రహ్మణస్వామి వారికి అభిషేకం, అర్చన తర్వాత సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేశారు.
సుబ్రహ్మణస్వామికి అభిషేకంలో స్వామి వారికి పంచామృతాలైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లు, వివిధ ఫలాల రసాలతో అభిషేకం నిర్వహించారు. వివిధ పళ్ల రసాలతో అభిషేకం వల్ల ఎంతో ఫలితం ఉంటుందని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి.
లోక కల్యాణం కోసం శ్రీశైలంలో మంగళవారం సాయంత్రం క్షేత్ర పాలకుడు శ్రీబయలు వీరభద్రస్వామికి అర్చకులు, వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం, అమవాస్య రోజుల్లో బయలు వీరభద్రస్వామికి విశేష అభిషేకం, అర్చనలు నిర్వహిస్తారు.
బయలు వీరభద్రస్వామి శివభక్త గణాలకు అధిపతి. శ్రీశైల క్షేత్ర పాలకుడిగా క్షేత్రానికి ప్రారంభంలో ఆరు బయట ఉండి ఎటువంటి ఆచ్చాదన, ఆలయం లేకుండా బయలుగా దర్శనం ఇస్తారు కనుక ఆయనకు బయలు వీరభద్రస్వామి అనే పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట మకుటం కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తారు. స్వామి వారికి కింద.. కుడి వైపు దక్షుడు, ఎడమ వైపున భద్రకాళి దర్శనం ఇస్తారు. ఈ స్వామిని దర్శించడంతోనే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలిగిపోతాయని, వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి.
ముఖ్యంగా ఆగమ శాస్త్ర సంప్రదాయంలో క్షేత్ర పాలక పూజకు చాలా విశేష స్థానం ఉంది. క్షేత్ర పాలకుడికి పూజలు చేయడం వల్ల ఆ క్షేత్రంలో గల భక్తులు ఎటువంటి భయాలు, బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. మంగళవారం, ఆదివారం, అమావాస్య రోజుల్లో చేసే వీరభద్ర పూజ పలు ఫలితాలను ఇస్తుందని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ స్వామి పూజతో సకల గ్రహ అరిష్ట దోషాలు, దుష్ట గ్రహ పీడలు తొలగుతాయి. సంతానం, ఐశ్వర్యం తదితర పలు శుభ ఫలితాలు చేకూరతాయి. ఈ పూజాధికాలతో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తారు.