అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీలో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన సీఎం జగన్ హామీ ఏమయిందని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లో మూడు లక్షలకు పైగా ఖాళీలున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని సోము వీర్రాజు గుర్తు చేశారు.
నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయని కారణంగా తాగునీటి ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నాయని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వల్ల పారదర్శకత లోపిస్తుందని చెప్పారు. జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగ యువత నిరాశలో కొట్టుమిట్టాడుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ వయసు దాటి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సోము వీర్రాజు సీఎంకు రాసిన లేఖలో డిమాండ్ చేశారు.
వ్యవసాయశాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా ఎందుకు కాలయపన చేస్తున్నారని లేఖలో సోము వీర్రాజు నిలదీశారు. ట్రాన్స్కో, జెన్కో వంటి విద్యుత్ సంస్థల్లో డిగ్రీ పట్టా కలిగి ఉన్న యువతకు అవకాశం కల్పించేలా నిబంధనలను సరళీకృతం ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ తెస్తారని బీఎడ్ చేసిన వారు నోటిఫికేషన్ కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో 1,148 పోస్టులు ఖాళీలను భర్తీ చేయాలని ఆ శాఖ ప్రభుత్వాన్ని కోరినా ఎందుకు పట్టించుకోవడం లేదో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్లో టీచర్ పోస్టులు 25 వేలు, కానిస్టేబుల్ పోస్టులు 16 వేలు, లైబ్రరీసైన్స్ 6 వేల పోస్టులు, సచివాలయంలో 8 వేలు, విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అలాగే, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసేలా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని తన లేఖలో వీర్రాజు ప్రభుత్వాన్ని కోరారు.