విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అమరావతిని రూ.10 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. రాష్ట్ర రాజధానిపైన జగన్ సర్కార్ స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించాలని మీడియా సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. రాజధాని అభివృద్ధి చేయాలని రైతులు భూములు ఇస్తే.. వాటిని అమ్మేయాలని నిర్ణయించడం కన్నా దారుణం ఇంకోటి లేదన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా క్యాపిటల్పై సరైన అభిప్రాయం లేకపోయిందని, తాము కలవరపడుతూ రాష్ట్ర ప్రజల్ని తికమక పరిస్థితిలోకి నెట్టేస్తున్నారని సోము వీర్రాజు విమర్శించారు. ముఖ్యమంత్రి సచివాలయంకు రాకుండా క్యాంప్ కార్యాలయం నుంచే పాలన కొనసాగించడం మంచిది కాదన్నారు. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లు అయినా లేకపోయిందని విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగిందని సోము వీర్రాజు చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. తాము అధికారంలోకి రాగానే రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనడం రద్దు చేస్తామని చెప్పారు. పేదలకు కేంద్రం ద్వారా మసూరి బియ్యం అందేలా చూస్తామన్నారు. నిరుపేదలందరికీ ఇళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీ ఒక్కటే ఏపీకి, దేశానికి ప్రత్యామ్నాయమన్నారు.