అమరావతి : ల్యాప్టాప్ పేలి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన వైఎస్సార్ కడప జిల్లా బి.కోడూరు మండలం మేకవారి పల్లెలో జరిగింది. గత సోమవారం వర్క్ఫ్రం హోంలో భాగంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ సుమలత (22) ల్యాప్టాప్పై పనిచేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంటి గదికి గొళ్లెం బిగించుకుని బెడ్పైన కూర్చొని వర్క్ చేస్తున్న సుమలత విద్యుత్ షాక్కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బెడ్కు సైతం మంటలు అంటుకున్నాయి.
గదిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. తీవ్రంగా గాయపడిన సుమలతను చికిత్స నిమిత్తం కడప ఆస్పత్రికి తరలించారు. ఆమెకు 80 శాతం కాలిన గాయాలు కావడంతో ఆమెను రిమ్స్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐదురోజులుగా చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం తుది శ్వాస విడిచింది.