హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): వేసవి సెలవుల కారణంగా తిరుమల కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతుండడంతో జూన్ 30వ తేదీ వరకు స్వామి వారి సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేసింది. ఫలితంగా 20 నిమిషాలు ఆదా అవుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించడం ద్వారా 30 నిమిషాలు ఆదా కానున్నది. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తారు. దీంతో 3 గంటలు ఆదా అవుతుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది. టీటీడీ వెబ్సైట్ https//tiru patibalaji. ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు.