తిరుమల : వేసవి సెలవుల కారణంగా తిరుమల(Tirumala )లో పెరుగుతున్న భక్తుల రద్దీతో సామాన్యుల భక్తుల(Common devotees) కోసం టీటీడీ పలు చర్యలు తీసుకుంటుంది. సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతుండడంతో శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు వేచి ఉండే సమయం ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సామాన్యభక్తుల సౌలభ్యం కోసం జూన్ 30వ తేదీ వరకు స్వామివారి సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్( Ttd Chairman) వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.
శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవ(Suprabhata seva)కు విచక్షణ కోటాను రద్దు చేశామని దీనివల్ల 20 నిమిషాల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా 30 నిమిషాల సమయం ఆదా అవుతుందన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాల(VIP Darsan)కు సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
కేవలం స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని, ఈ నిర్ణయం వల్ల ప్రతిరోజు మూడు గంటల సమయం ఆదా అవుతుందని వెల్లడించారు. క్యూలైన్లలో గంటల తరబడి కిలోమీటర్ల మేర వేచి ఉండే వేలాది మంది సామాన్య భక్తులకు ఈ నిర్ణయాల వల్ల త్వరితగతిన స్వామివారి దర్శనం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు, వీఐపీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.