నెల్లూరు: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2 గంటలకు కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదేసమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును గుద్దింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రైవేట్ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. మరణించినవారిలో రెండు లారీల డ్రైవర్లు, బస్సు డ్రైవర్, మరో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.