తిరుమల : ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh ) రాష్ట్రంలోని ప్రయాగ రాజ్(అలహాబాద్) వద్ద 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళా (Kumbh Mela) కార్యక్రమంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటుకు టీటీడీ నిశ్చయించింది. దేశవ్యాప్తంగా హిందు ధర్మ ప్రచారం కోసం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు.
ఇందులో భాగంగా టీటీడీ జేఈవో గౌతమి ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ను శనివారం లాంఛనంగా కలిశారు. ప్రయాగరాజ్లో ఆలయం ఏర్పాటుకు ఆరో సెక్టార్లో 2.50 ఎకరాల స్థలాన్ని టీటీడీకి కేటాయించింది. ఈ సందర్భంగా జేఈవో ఆ స్థలాన్ని టీటీడీ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.
ముఖ్యంగా కుంభమేళాకు తరలివచ్చే ఉత్తరాది భక్తులను దృష్టిలో ఉంచుకుని నమూనా ఆలయం వద్ద ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్థలాన్ని పరిశీలించిన టీటీడీ బృందంలో హెచ్ డీపీపీ సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి, ఈఈ సురేంద్రనాథ్ రెడ్డి, స్థానిక అధికారులు ఉన్నారు.