AP BRS Party | మిగ్జాం తుఫాను ప్రభావంతో అతలాకుతలమై తీవ్రంగా నష్టపోయిన ఏపీ రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చేతికొచ్చిన ధాన్యం, అరటి, జొన్న పంటలు నీట మునిగి వేలాది ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రకృతి విప్పత్తులు మిగిల్చిన నష్టంతో రైతులు కుదేలవుతున్నారన్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా తడిసిన, నేలకొరిగిన ధాన్యాన్ని ప్రభుత్వం మానవతా దృక్పథంతో కొనుగోలు చేసి వారిని ఆడుకోవాలని తోట విజ్ఞప్తి చేశారు. కుండపోత వర్షం, ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయాయన్నారు.
దీంతో గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి గ్రామీణ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని వాపోయారు. పూర్తిగా జలమయమైన లోతట్టు ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పించి ప్రభుత్వం వారిని అన్నీ విధాలుగా ఆదుకోవాలని కోరారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొనాలని తోట పిలుపునిచ్చారు.