Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఐదోరోజు ఆది దంపతులకు పూజాధికాలు శాస్త్రోక్తంగా జరిగాయి. మంగళవారం ఉదయం చండీశ్వరపూజ మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్ర పారాయణాలు, రుద్రహోమం, చండీహోమం జరిపించినట్లు ఈవో ఎస్ లవన్న తెలిపారు. సాయంకాలార్చనలు, హోమాల తర్వాత స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన రావణ వాహనంపై వేంచేబు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు నిర్వహించారు.
మంగళవాయిద్యాలు డప్పుచప్పుళ్లతో క్షేత్ర వీధుల్లో ఊరేగించారు. ఉత్సవం గంగాధర మండపం నుండి నంది మండపం మీదుగా బయలువీరభధ్ర స్వామి వరకు ఆద్యంతం నయనానందకరంగా సాగింది. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, భీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు,శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది.
ఉత్సవ తర్వాత కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు స్వామి అమ్మవార్లకు ఆస్థానసేవ జరిగింది. రావణ వాహనాధీశుడైన స్వామి అమ్మవార్లను దర్శించుకున్న వారు కష్టాలనుండి వీడి సుఖ సంతోషాలతో బాసిల్లుతారని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాద్యులు తెలిపారు.
ఇదిలా ఉంటే ఆలయ మాడవీధిలోని భ్రామరీ కళావేదిక, పుష్కరిణి, శివదీక్షా శిబిరాల వద్ద సాయంత్రం నుండి అర్థరాత్రి వరకు భక్తులు తిలకించేందుకు ఏర్పాటు చేసిన కూచిపూడి, భరతనాట్యం, హరికథ, బుర్రకథ, భక్తరంజని, నాటికలు వంటి కార్యక్రమాలు అందరిని అలరిస్తున్నాయని పిఆర్వో శ్రీనివాసరావు తెలిపారు.
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదవరోజు మంగళవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఉదయం మృత్యుంజయ, రుద్ర, చండీపారాయణాలతోపాటు శాస్త్రోక్త పూజలు నిర్వహించినట్లు ఈవో ఎస్ లవన్న తెలిపారు. సాయంత్రం భ్రామరి సమేతుడైన మల్లిఖార్జునుడు రావణ వాహనంపై ఉరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కళాకారుల డప్పు చప్పుళ్ల మధ్య గ్రామోత్సవం శోభాయమానంగా జరిగింది. ఉభయ దేవాలయాల్లో షోడశోపచార పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చినట్లు చెప్పారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఆలయ ప్రధాన గోపురం వద్దకు వచ్చిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డితోపాటు నంద్యాల ఎంపీ పీ బ్రహ్మానందరెడ్డిలకు ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చక వేదపండితులు ఘనంగా స్వాగతం పలికారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ బ్రహ్మానందరెడ్డిలు ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించుకున్నారు. రావణ వాహన సేవ పూజా కార్యక్రమాల్లో పాల్గొని గ్రామోత్సవాన్ని ప్రారంభించారు.
శ్రీశైల క్షేత్రానికి పాదయాత్ర చేస్తూ వచ్చే యాత్రికుల అవసరాల కోసం చేపట్టిన అభివృద్ది పనుల్లో అలసత్వం వహించవద్దని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మెన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న అధికారులకు సూచనలిచ్చారు. మంగళవారం వారు పాతాళగంగ, వలయ రహదారి, పార్కింగ్, శౌచాలయాలతోపాటు కైలాసద్వారం, హఠకేశ్వరం, సాక్షిగణపతి ప్రాంతాలలో పర్యటించి, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులకు అత్యవసర వైద్య చికిత్సకు ఉపయోగపడే ఔషధాలను హైదరాబాద్లోని సాగర్సాఫ్ట్ (ఇండియా) లిమిటెడ్ విరాళంగా అందజేసింది. సాగర్ సాఫ్ట్ నుంచి మంగళవారం దేవస్థానం దవాఖాన ఏఈవో ఫణిందర్ ప్రసాద్, పర్యవేక్షకులు శ్రీను, చంద్రశేఖర్ ఔషధాలు తీసుకున్నారు. యాత్రికుల ఆరోగ్య భద్రత కోసం ముందుకు వస్తున్న దాతలను ఈవో లవన్న అభినందించారు. దాతలకు స్వామిఅమ్మవార్ల ఉభయ దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాలు కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.