Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన శివస్వాములు దేవస్థానం ఏర్పాట్లు దర్శన విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యూలైన్లలో ఆందోళనకు దిగారు. బుధవారం క్షేత్రానికి వచ్చిన స్వాములు సుమారు 5 గంటలకు పైగా క్యూలైన్లో వేచి ఉన్నప్పటికీ స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించకపోవడంతోపాటు కనీసం అల్పాహారం, మంచి నీరు కూడా అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలైన్లలో కిక్కిరిసిపోయిన శివస్వాములు సహనం కోల్పోయి ఆలయ ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండు రోజుల్లో మెదలవుతున్నందున స్పర్శ దర్శనం చేసుకునేందుకు వచ్చే యాత్రికుల రద్దీ గణనీయంగా పెరిగిపోయింది. అదే విధంగా దేవస్థానం అధికారులు సామాన్య భక్తుల దర్శనాలను నిర్లక్ష్యం చేస్తూ ఆర్జిత వీఐపీ దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం సమంజసం కాదని శివస్వాములు ఆందోళన చేయడంతో సహ యాత్రికులు కూడా అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
శ్రీశైల ఆలయ ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించుటకు తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులు కూడా సహకరించాలని కోరుతున్నారు. అదే విధంగా సామూహిక అభిషేక సేవాకర్తలు, బ్రేక్ దర్శనాల కోసం కూడా అధిక సమయం పడుతుందని అన్నారు. పాదయాత్రలు చేసి వచ్చే శివస్వాములకు ప్రాధాన్యత కల్పిస్తూ వీలైనంత త్వరగా దర్శనం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఈవో తెలిపారు.