Road Accident | ఏపీలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే ప్రత్తిపాడు మండలం కొండపాడుకు చెందిన పలువురు ట్రాక్టర్లో చేబ్రోలు మండలం జూపుడికి శుభకార్యం కోసం బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు మార్గమధ్యంలో ప్రాణాలు వదిలారు. క్షతగాత్రుల్లో సలోమి అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్లో 40 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.