వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామ పంచాయతీల్లో శాశ్వత పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లా పరిషత్ సీఈవోలు, డిప్యూటీ సీఈవోల డైరీని మంగళవారం పర్వతగిరిలో మంత్రి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామానికి వస్తున్న నిధులు, జరుగుతున్న పనులు గురించి సర్పంచులకు అవగాహన కల్పించాలని సీఈవోలు, డిప్యూటీ సీఈవోలకు సూచించారు.
ఒక్కో గ్రామపంచాయతీకి ఏటా కనీసం రూ. కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు నిధులు వస్తున్నాయని వివరించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా 15వ ఆర్థిక సంఘం ఇచ్చే నిధులకు సమానంగా పంచాయతీలకు నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని వెల్లడించారు.కేంద్రం నుంచి మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ. 1100 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందని తెలిపారు. దీంతో సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సర్పంచులు ఎక్కడైనా బిల్లులు రాలేదని చెప్తే గ్రామ కార్యదర్శులు స్పందించి సరైన సమాచారం అందజేయాలని సూచించారు.
పంచాయతీకి ట్రాక్టర్లు కేటాయించడం వల్ల పంచాయతీకి ఆదాయం సమకూరుతుందన్నారు. గ్రామపంచాయతీలకు భవనాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ట్రాక్టర్లు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు వంటి ఆస్తులు శాశ్వతంగా ఉండే విధంగా ఏర్పాటు కావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బి రాఘవేంద్రరావు, ఉపాధ్యక్షులు నరసింహులు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.