అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు మంగళవారం పునః ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు బడిబాటపట్టనున్నారు. అయితే, ఈ సారి ఆరు అంచెల కొత్త విధానంలో విద్యా సంవత్సరం అమలుకానున్నది. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పీపీ-1, పీపీ-2లతో కూడిన శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లతో ప్రారంభించనున్నారు.
శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హైస్కూలు, హైస్కూల్ ప్లస్గా పాఠశాలల ఉండనున్నాయి. ఇప్పటివరకు విలీన ప్రక్రియ పూర్తయిన ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని హైస్కూళ్లు, ప్రీ హైస్కూళ్లకు తరలించేందుకు విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు కూడా జారీచేసింది. ఇవాళ్టి నుంచే పాఠశాలల ప్రారంభం తొలిరోజే విద్యార్థులకు ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కిట్లను అందించనున్నది.
ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అందించనున్నారు. ఇందులో మూడు జతల యూనిఫాం క్లాత్, బూట్లు, సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్, టెక్స్ బుక్స్, వర్క్బుక్స్తో పాటు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందజేయనున్నది. సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ హైస్కూల్లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.