Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడు రోజుల పంచాహ్నిక దీక్షతో నిత్యం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అలంకారాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవరోజు మంగళవారం ఉదయం శ్రీచండీశ్వరస్వామికి షోడశోపచార క్రతువులు చేశారు. అటుపై దేవస్థానం ఈవో లవన్న ఆధ్వర్యంలో రుద్రహోమ పూర్ణాహుతి, కళశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచన పూజాధికాలు నిర్వహించారు.
మల్లికాగుండంలో వైదిక శాస్త్రోక్త అవ బృదస్నానం చేయించాక వసంతోత్సవం నిర్వహించారు. సంక్రాంతి రోజు స్వామి అమ్మవార్ల కళ్యాణం తరువాత సంప్రదాయం ప్రకారం పార్వతీదేవి అమ్మ వారికి మెట్టెలు నల్ల పూసలు సమర్పించారు. అందుకోసం నిర్వహించిన నాగవల్లి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు తీసుకున్నట్లు అర్చకులు చెప్పారు. నిత్యకళ్యాణ మండపంలో సదస్యం వేదస్వస్థి జరిగిన తరువాత ఉత్సవ తొలి రోజు దేవతాహ్వానానికి ఆవిష్కరించిన ధ్వజపటాన్ని అవరోహణ కార్యక్రమం అద్యంతం కన్నులపండుగగా జరిగింది.
భారతీయ జీవనశైలికి పరమాధారమైనవి చతుర్వేదాలేనని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న అన్నారు. సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా రాష్ట్రం నలుమూలల నండి వచ్చిన వేదపండితుల ఆధ్వర్యంలో సామవేదం, ఋగ్వేదం, అధర్వణవేదం, యజుర్వేద పఠనం చేయించారు. ఉదయం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో.. సాయంత్రం నిత్యకళ్యాణమండపంలో నాలుగు వేదాలను పఠించాక సదస్యం కార్యక్రమం నిర్వహించారు.
సామాన్యులకూ వేదసారం అర్థమయ్యే ఆవశ్యకత ఉన్నదని, అందుకు ప్రత్యేకంగా వేదసభ నిర్వహించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. వేద పఠనానికి వచ్చిన పండితులకు స్వామి అమ్మవార్ల శేష వస్త్రంతోపాటు నూతన వస్త్రాలు ఇచ్చి ఘనస్వస్తి నిర్వహించినట్లు స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు.
శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠ నిఘా మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభయ దేవాలయాలు, పరివార దేవతాలయాల హుండీల్లో వచ్చిన బహుమతులు, నగదు విరాళాలను లిక్కించారు.
గత 28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ. 3,57,81,068 ఆదాయం వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. వీటితోపాటు 103 గ్రాముల బంగారం, 7.520 కిలోల వెండి ఆభరణాలు, 243 అమెరికా డాలర్లు, 220 యూఏఈ ధీర్హమ్లు, 61 సింగపూర్ డాలర్లు, 175 ఆస్ట్రేలియా డాలర్లు, 20 కెనడా డాలర్లు, 150 యూరోలు, 25 ఇంగ్లాండ్ పౌండ్లు తదితర విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మొక్కులుగా హుండీలో భక్తులు సమర్పించారు.