Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కూటమిలో జనసేన, బీజేపీకి అసలు ఉనికే లేకుండా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అనుకున్నవాళ్లకే టికెట్లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. జనసేన, బీజేపీ అభ్యర్థులను కూడా చంద్రబాబే నిర్ణయిస్తున్నాడని చెప్పారు. తాను ఏది చెబితే అదే జరగాలని చంద్రబాబు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఏం అనుకుంటారనే ఆలోచన లేకుండా బాబు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు పిల్లచేష్టలు చేస్తున్నారని, ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు తిడుతున్నారని సజ్జల మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు కూడా అధికారులను కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులపై చంద్రబాబు అండ్ కో తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని చెప్పారు. వ్యవస్థలపై చంద్రబాబుకు గౌరవమే లేదని మండిపడ్డారు. వృద్ధులకు టైమ్కు పెన్షన్లు అందకుండా చంద్రబాబు పాపానికి పాల్పడ్డారని విమర్శించారు. వాలంటీర్లపై కక్షతో బాబు ఈ పాపానికి పాల్పడ్డారని ఆరోపించారు. బాబు ఎన్ని కుట్రలు చేసినా 93 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామని చెప్పారు. పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.
చంద్రబాబుది రాక్షస మనస్తత్వం అని వ్యాఖ్యానించారు. చంద్రబాబును వృద్ధులు బండ బూతులు తిడుతున్నారని చెప్పారు. పెన్షన్ల కోసం వచ్చి వృద్ధులు మరణించడానికి చంద్రబాబు కారణం కాదా? అని ప్రశ్నించారు. దగ్గుబాటి పురంధేశ్వరి కూడా చంద్రబాబు కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. బాబు ఏజెంట్గానే అధికారులపై ఈసీకి పురంధేశ్వరి ఫిర్యాదు చేశారని తెలిపారు. పురంధేశ్వరి ఫిర్యాదు ప్రకారం ఏపీలోని అధికారులంతా అవినీతిపరులేనా అని ప్రశ్నించారు. ఈసీ తాము చెప్పినట్టు వింటుందని పురంధేశ్వరి భావిస్తున్నారా? అని నిలదీశారు. ఏపీలో వ్యవస్థలన్నీ ఇండిపెండెంట్గానే పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.
బాబు మోసాలు ఎలా ఉంటాయో ప్రజలకు తెలుసని సజ్జల అన్నారు. జగన్ మాటిచ్చారంటే వెంటనే అమలు చేస్తారన్నారు. చంద్రబాబు.. మాయల ఫకీరులాగా హామీలు ఇస్తున్నారని అన్నారు. ప్రజలను నమ్మించడానికి అన్ని ఫ్రీఫ్రీ అంటున్నారని విమర్శించారు.చంద్రబాబుకు జగన్కు తేడా గమనించాలని కోరుతున్నా అన్నారు.