తిరుమల : తిరుమల (Tirumala) కు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా అన్నప్రసాద విభాగాన్ని పునరుద్ధరించేందుకు టీటీడీ (TTD) అన్ని చర్యలు తీసుకుంటుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి(AV Dharma Reddy) తెలిపారు. భక్తులకు ఉత్తమమైన సేవలను అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు . గోకులం విశ్రాంతి భవనంలో 75వ గణతంత్ర దినోత్సవం (Republic day) సందర్భంగా ఆయన జాతీయ జెండా ను ఆవిష్కరించి మాట్లాడారు.
ఉద్యోగులు, సిబ్బందిలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా అన్నప్రసాద విభాగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 6న కురిసిన భారీ వర్షంతో తిరుమల కొండపై వచ్చే రెండేళ్ల పాటు తాగునీటి అవసరాలకు ఇబ్బందులు రావని అన్నారు. అన్ని డ్యామ్లలో సరిపడా నీరు ఉందని పేర్కొన్నారు. గత ఆరు నెలల్లో వసతి, అన్నప్రసాదం, జంట బ్రహ్మోత్సవాలు, వైకుంఠద్వార దర్శనం, తిరుమలలోని ఎస్వీ హైస్కూల్లో విద్యావ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు మరెన్నో సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు.
యాత్రికుల సేవలో అంకితం కావాలని సూచించారు. అనంతరం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో, పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.