అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం చేతకాని తనం వల్లే ఏజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించిందని ఏపీ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి ప్రధాన మంత్రితో ఏం మాట్లాడారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యే్క హోదా కోసం లక్షలాది మంది యువకులు ఎదురుచూస్తున్నారని అన్నారు.
హోదా కోసం కేంద్రంతో పోరాటాలు చేస్తే తాము కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. పార్లమెంట్లో 28 మంది ఎంపీలున్న వైసీపీ ప్రత్యేక హోదాను అజెండాలో పెట్టించలేకపోయిందని ఆరోపించారు. సీఎం మౌనం వీడితే అన్ని ప్రశ్నలకు సమాధానం వస్తుందన్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన ఏపీ సీఎం జగన్కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని విమర్శించారు.
తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు 5కోట్ల మంది ఆంధ్ర ప్రజల ఆకాంక్షలను కేంద్రానికి జగన్ అమ్మెసారని దుయ్యబట్టారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చని ఎంపీలు, సీఎం తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.