అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరాంధ్ర దిశగా వేగంగా కదులుతోంది. విశాఖకు 580 కి.మీ దూరంలో ఉన్న జవాద్ తుఫాన్.. తీరం వైపు వేగంగా దూసుకొస్తుంది. ఈ కారణంగా సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
చెట్లు , విద్యుత్తు స్తంభాలు విరిగిపడే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థలు సూచించాయి. 5వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి రావాలని కోరాయి. కాగా తుఫాన్ భయంతో ఉత్తరాంధ్ర రైతులు ముందుగానే పలు జిల్లాల్లో వరికోతలను ప్రారంభించి పొలాల నుంచి సురక్షిత స్థలాలకు ధాన్యాన్ని తరలిస్తున్నారు.
జవాద్ తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 24 ఎన్డీఆర్ఎఫ్, 158 రాష్ట్ర అగ్నిమాపక సేవల బృందాలు, 33 ఓడీఆర్ఏఎఫ్ను ఆయా ప్రాంతాల్లో మోహరించారు.