TTD | సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి పర్వదినం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ సందర్భంగా ఏడువాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. పవిత్రమైన మాఘమాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి, మాఘ సప్తమిగా పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలుగానూ పిలుస్తారు.
తెల్లవారు జామున 5.30 గంటల నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.40 గంటలకు) సూర్యప్రభ వాహన సేవ జరుగుతుంది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై శ్రీవారి విహరిస్తారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ జరుగుతుంది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి కటాక్షించనున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరుగనున్నది. రథసప్తమి నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా, సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.