అమరావతి: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా రాబోయే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు జిల్లాలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో వాయుగుండం తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తుందని, ఇది క్రమంగా మరింత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని తెలియజేసింది. ఈ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ప్రత్యేకంగా రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాలు, కోస్తాంధ్రలోని నెల్లూరు జిల్లా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయన్నారు. ఈనెల 4 నుంచి 6 వరకు వర్షాలు మరింతగా పెరిగే అవకాశముందన్నారు. కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.