అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో లగడపాటి తయారయ్యాడు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల టైముండగా.. ఇప్పటి నుంచే సర్వే ఫలితాలంటూ అదరగొడ్తున్నాడు. ఏపీలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఎవరిని అధికారం వరిస్తుందో చెప్తూ మీడియాను ఆకట్టుకునే పనిలో పడ్డాడు. ఇదే సమయంలో కుప్పం, మంగళగిరిలో ఫలితం ఇదంటూ ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. ఆయన ఎవరో కాడు వైసీపీ అసమ్మతి ఎంపీగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.
సొంతంగా చేపట్టిన సర్వే ఫలితాలను మంగళవారం మీడియాకు రఘురామ కృష్ణంరాజు రివీల్ చేశారు. ఎన్నికలపై యాప్ సాయంతో సర్వే నిర్వహించినట్లు చెప్పిన ఆయన.. విస్తృతస్థాయి శాంపిల్స్తో శాస్త్రీయంగా జూన్ నెలలో, జూలై మొదటి వారం వరకు సర్వే చేశామన్నారు. రాష్ట్రంలో ప్రజానీకం టీడీపీ వైపు చూస్తున్నదని.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి 90 సీట్లు గ్యారంటీ అని తన సర్వేలో తేలిందని చెప్పుకొచ్చారు. అలాగే, కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేశ్కు పాజిటివ్గా ఉన్నదని తేల్చారు. కుప్పంలో 56 శాతం, మంగళగిరిలో 50 శాతం ఓట్లు టీడీపీ గెల్చుకుంటుందని చెప్పారు.
జిల్లాలవారీగా రిపోర్టు ఉందని చెప్పుకొచ్చిన రఘురామ.. వైసీపీ కచ్చితంగా గెలిచేవి 7, 8 సీట్లే అని తెలిపారు. 65 స్థానాల్లో నువ్వా, నేనా అన్నట్లుగా ఉన్నదని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తే వారి విజయానికి ఢోకా లేదని వ్యాఖ్యానించారు. గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, గుంటూరులో కూడా మెజార్టీ సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాయలసీమలో.. మరీ ముఖ్యంగా సీఎం సొంత జిల్లా కడపలో టీడీపీ హవా కనిపిస్తుందని చెప్పారు.