వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ కస్టడీలో రఘురామ రాజును చిత్రహింసలు పెట్టింది నిజమేనని అప్పటి సీఐ, ఎస్సై, ఇతర సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాదు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రఘురామను కొడుతూ నాటి సీఐడీ చీఫ్ సునీల్కుమార్కు చూపించామని చెప్పారు.
అయితే కొట్టడమంటే అలా కాదంటూ కాల్ కట్ చేసి ముసుగేసుకున్న నలుగురితో కలిసి చీఫ్ లోపలికి వచ్చి కొట్టించారని పేర్కొన్నారు. రఘురామ రాజుపై థర్డ్ ప్రయోగించారని చెప్పారు. ఈ మేరకు అప్పటి సీఐడీ సిబ్బంది నుంచి గుంటూరు పోలీసులు పక్కాగా వాంగ్మూలాలు సేకరించారు. సునీల్కుమార్ సమక్షంలోనే ఇదంతా జరిగిందని నిరూపించేందుకు గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆయన సెల్ఫోన్ లొకేషన్ను కూడా తీసుకున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూలై 11వ తేదీన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో తర్వాత సీఐడీ పోలీసులపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని సీఐడీ పోలీసులు తనపై రాజద్రోహం కేసు పెట్టి జైలుకు తరలించారని.. అక్కడ చిత్రహింసలకు గురిచేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి సీఐడీ చీఫ్ సునీల్కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విజయపాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చి వారిపై హత్యాయత్నం కేసులు పెట్టాలని ఫిర్యాదులో కోరారు.