Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మ వార్ల క్షేత్రంలో ఆదివారం పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం పరివార దేవతలకు ఘనంగా అర్చనలు, అభిషేకాలు చేశామని అర్చక పండితులు చెప్పారు. ఆదివారం సాయంత్రం పౌర్ణమి సంధ్యా సమయంలో స్వామిఅమ్మవార్లను ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ఊయలలో ఆశీనులను చేసి అష్టోత్తర నామావళి, ఖడ్గమాల పఠించారు.
శ్రీభ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేసి ఊయల సేవ జరిపించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో వేంచేబు చేసి ఆలయ ప్రదక్షిణగా అర్చక వేదపండితులు, భక్తులు ఉత్సవం జరిపించారు. ఉభయ దేవాలయాల్లో పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమాల తరువాత భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆదివారం మధ్యాహ్నం నుండి కురుసున్న వర్షం కారణంగా సాయంత్రం గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు శ్రీశైలం ఏఈవో హరిదాసు తెలిపారు. స్వామి అమ్మవార్ల గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు స్వామి అమ్మవార్ల అలంకార దర్శనాలు మాత్రమే చేసుకున్నారు. తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం వరకు సుమారు 30 వేల మందికి పైగా ఉభయ దేవాలయాల్లో దర్శనాలు చేసుకున్నారు.
సర్వదర్శనానికి నాలుగు గంటలు, శీఘ్ర దర్శనానికి రెండు గంటలు, శీఘ్ర దర్శనానికి గంట సమయం పట్టిందని పీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా గర్బాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా నిలివేశారు.
వివిధ ప్రాంతాల్లో ఉండే భక్తుల సౌకర్యం కోసం నిర్వహిస్తున్న పరోక్షసేవకు విశేష ఆదరణ లభిస్తుందని ఈవో లవన్న తెలిపారు. నిత్య ఆర్జిత పరోక్ష సేవలతోపాటు ప్రతి పౌర్ణమికి భ్రమరాంబ అమ్మవారికి జరిపే లక్షకుంకుమార్చనలో భక్తులు తమ గోత్ర నామాలను ముందుగా నమోదు చేయించుకుని అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని పొందుతున్నారని తెలిపారు. భక్తులు <http://www.srisailadevasthanam.org> ఆన్లైన్ వెబ్సైట్లో పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని ఈవో కోరారు.