BRS Party | ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేది బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రగతినగర్ సుందరయ్య భవన్లో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తోట చంద్రశేఖర్ను నిజాంపేట మేయర్ కొలను నీలా గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో జంట నగరాల్లో స్థిరపడ్డ సీమాంధ్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి నభూతో నభవిష్యత్ అన్న చందంగా ఉందని, అన్నివర్గాల అభ్యున్నతి బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకుపోతూ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని స్పష్టం చేశారు.
రైతుబంధు పథకాన్ని అమలు చేస్తూ రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచిందన్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ఆమడ దూరంలో ఉందన్నారు. ఆంధ్రాలో సహజ వనరులు, మానవ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఆంధ్ర రాష్ట్రం అధోగతిపాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు.
రానున్న కాలంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ కమిటీలను నియమిస్తామని చెప్పారు. అంతకు ముందు తోట చంద్రశేఖర్ భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం ఫోరం సభ్యులు శాలువాలు, గజమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, కార్పొరేటర్లు అర్పిత, రాజేశ్వరి, అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, కూనపరెడ్డి వెంకటరావు, రాఘవేంద్ర ప్రసాద్, శ్రావణ్ కుమార్, చంద్రగిరి సతీశ్, షేక్ రఫియా బేగం, బీఆర్ఎస్ శ్రేణులు, ఏపీకి చెందిన తోట సుబ్బారావు, అలమూరు రఫి, మెహబూబ్ భాషా, తెనాలి భాషా, తలారి శ్రీనివాస్ పాల్గొనగా సభాధ్యక్షుడిగా సీహెచ్ శ్రీకాంత్ వ్యవహరించారు.