అమరావతి : కేంద్ర ప్రభుత్వం రామరాజ్యం పాలన(Ram Rajyam rule) ను అందించే విధంగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi )పేర్కొన్నారు. విధి నిర్వహణలో అధికారులు రాముడి పాలనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా (Satyasai District) లో నెలకొల్పిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(నాసిన్)ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన సుదీర్ఘ ప్రసంగంలో రాముడి పాలనను ఉదాహరించారు.
రానున్న రోజుల్లో నాసిన్ (Nasin) కేంద్రం ప్రముఖ శిక్షణా సంస్థగా మారుతుందని. సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా రూపుదిద్దుకోబోతుందని స్పష్టం చేశారు. రామరాజ్యంల అందినట్లు ప్రజలకు సుపరిపాలన అందాలని గాంధీజీ అన్నారని గుర్తుచేశారు. రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ సరళంగా ఉండేదని, సుపరిపాలన అంటే బలహీనులకు అండగా ఉండాలని అన్నారు . 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత పన్నులను సరళీకృతం చేయడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు సుమారు లక్షల కోట్ల రూపాయలు లాభం జరిగిందని వివరించారు.
తాము తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల పన్నులు చెల్లించే వారి సంఖ్య నానాటికి పెరుగుతుందని పేర్కొన్నారు. పదేళ్లుగా దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతుందని, అనేక కార్యక్రమాల వల్ల మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరుగుతుందని మోదీ అన్నారు. జీఎస్టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చామని వివరించారు. పన్నుల వ్యవస్థ కూడా సరళంగా ఉండాలని, వచ్చే పన్నులతో దేశంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పేదలు, రైతులు, మహిళలు,యువకుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. పేదలకు ప్రభుత్వాలు సహకారమందిస్తే పేదరికం దూరమవుతుందని, 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని అన్నారు. పేదల జీవితాలు బాగుపడ్డాయనే విషయం నీతి ఆయోగ్ చెప్పిందని, వివిధ ఉపాధి అవకాశాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపామని నరేంద్ర మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.