Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 11 రోజుల పంచాహ్నిక దీక్షతో నిత్యం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు అలంకారాలతో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. ఉత్సవాలలో భాగంగా పదవ రోజు సోమవారం ఉదయం శ్రీ చండీశ్వరస్వామికి షోడశోపచార క్రతువులు చేశారు. ఈవో లవన్న, చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఆది దంపతులకు రుద్రహోమ పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచన పూజాధికాలు జరిపించారు.
ఆలయ పుష్కరిణిలో వైదిక శాస్త్రొక్తంగా అవబృదస్నానం చేయించిన తరువాత వసంతోత్సవాన్ని నిర్వహించారు. మహాశివరాత్రి నాడు స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరిపిన తరువాత సంప్రదాయం ప్రకారం పార్వతీదేవి అమ్మవారికి మెట్టెలు నల్లపూసలు సమర్పించే నాగవల్లి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధ ప్రసాదాలు తీసుకున్నట్లు అర్చకులు చెప్పారు. నిత్య కళ్యాణ మండపంలో సదస్యం జరిగిన తరువాత ఉత్సవ మొదటి రోజు దేవతాహ్వానానికి ఆవిష్కరించిన ధ్వజపట అవరోహణ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండువగా జరిగింది.