KA Paul | అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తానని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. జగన్ను కలిసేందుకు మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి కేఏ పాల్ వెళ్లారు. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేకపోవడంతో సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో జగన్ అపాయింట్మెంట్ కోసం క్యాంపు కార్యాలయం ఎదుట రోడ్డుపై చాలాసేపు వేచి ఉన్నారు.
ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై చర్చించి.. వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చానని చెప్పారు. ఏపీ సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తానని.. లేదంటే శపిస్తానని హెచ్చరించారు. తాను దేవుడి దూత, ప్రపంచ శాంతి దూతను చెప్పిన ఆయన.. తనను ఎవరూ ఆపలేరని తెలిపారు. 155 దేశాల ప్రెసిడెంట్లు తనను కలిశారని.. దేశంలో 14 మంది ముఖ్యమంత్రులు తనను కలుస్తున్నారని పేర్కొన్నారు. స్టాలిన్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, నితీశ్ కుమార్, శరద్ పవార్ ఇలా ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులు ఎందరో తనను కలిశారని చెప్పారు. తనను కలవని వారు లేరని కూడా తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తనను కలిశారని.. జగన్మోహన్ రెడ్డి కూడా కలుస్తారనే ఆశతోనే వచ్చానని అన్నారు. తనను తిరస్కరిస్తే దేవుణ్ని తిరస్కరించినట్టేనని హెచ్చరించారు. మంగళ, బుధవారం విజయవాడలోనే ఉండి జగన్ కోసం వేచి చూస్తానని తెలిపారు. కలిసేందుకు అనుమతి ఇవ్వకపోతే జగన్ కూడా మాజీ సీఎం అవుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారో.. 75 సీట్లు గెలుస్తారో.. 25 సీట్లు గెలుస్తారో తనకు తెలియదని అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి రాకముందు కేఏ పాల్.. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్కుమార్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ ఎన్నికలు చివరి దశలో నిర్వహించాలని కోరినట్లు చెప్పారు. ఎన్నికల రోజే ఫలితాలు కూడా ప్రకటించాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు.