విశాఖలో పోస్టల్ ఉద్యోగి ఒకరు ప్రజలకు శటగోపం పెట్టాడు. నకిలీ రసీదులు ఇచ్చి పేద, మధ్యతరగతి కుటుంబాలను లక్షల్లో ముంచాడు. 17 ఏండ్లుగా గ్రామీణ్ డాక్ సేవక్గా విధులు నిర్వర్తిస్తుండటంతో ఆయనపై ప్రజల్లో నమ్మకం కుదిరింది. దీన్నే పెట్టుబడిగా పెట్టి ఎందరినో నిలువు దోపిడీ చేశాడు. అయితే, సదరు పోస్టల్ ఉద్యోగి ఇటీవల గుండెపోటుతో చనిపోయిన తర్వాత భాగోతం బయటకు రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు, బాధితుల కథనం ప్రకారం, యలమంచిలికి చెందిన ఎస్కే వల్లీ.. చంద్రనగర్లో నివాసం ఉంటూ ఎల్లపువానిపాలెం పోస్టాఫీసులో గ్రామ్ డాక్ సేవక్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పోస్టాఫీస్ పథకాలపై జనాలకు అవగాహన కల్పిస్తూ పెద్ద సంఖ్యలో జనంతో పొదుపు చేయించాడు. రసీదులు, పుస్తకాలపై తానే స్టాంపులు వేసి పక్కాగా ఇచ్చేవాడు. అయితే, ప్రతి నెలా జనాలు ఇచ్చే డబ్బును పోస్టాఫీస్లో కాకుండా తన సొంత అకౌంట్లో వేసుకున్నాడు. చాలా ఏండ్లుగా పని చేస్తుండటంతో వల్లీపై ప్రజల్లో అనుమానం రాలేదు. ఇలాఉండగా, వల్లీ ఈ నెల 1వ తేదీన గుండెపోటుతో చనిపోయాడు.
ఎల్లపువానిపాలెంకు చెందిన రాము తన ఫిక్స్డ్ డిపాజిట్ కాలపరిమితి ముగియడంతో డబ్బు తీసుకునేందుకు శుక్రవారం పోస్టాఫీస్కు వెళ్లాడు. అక్కడ కొత్తగా విధుల్లోకి వచ్చిన ఉద్యోగి ఒకరు.. రాము పాస్ పుసక్తం చూసి నకిలీదని తేల్చారు. దీనిపై ఆరా తీయగా పథకం మొదలు నుంచి నకిలీ రసీదులు, పుస్తకాలతో వల్లీ నగదు సేకరించినట్లు తేలింది. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా అందరికి తెలియడంతో డబ్బులు కట్టినవారు వెళ్లి పోస్టాఫీసులో తనిఖీ చేయించారు. అవన్నీ నకిలీవని తేలడంతో అవాక్కయ్యారు. ఇలా దాదాపు రూ.కోటికిపైగా నొక్కేసినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై బాధితులు, అధికారులు గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బండారం బయటపడుతుందనే భయంతోనే గుండెపోటు వచ్చి చనిపోయి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను కోరుతున్నారు.