అమరావతి : అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పోలీసులు పలు కారణాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. కోర్టు అనుమతి ప్రకారమే పాదయాత్రను నిర్వహిస్తుండగా బుధవారం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో అడ్డుకోవడంతో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
31వ రోజుకు చేరుకున్న పాదయాత్ర ఈ రోజు మరుపూరు నుంచి ప్రారంభమై కొనసాగుతుంది. టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి యాత్రకు స్వాగతం పలికారు. పాదయాత్ర వెంట ముస్లిం, క్రైస్తవ ప్రచార రథాలు వెళ్లరాదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా రైతులు రోడ్డుపై బైఠాయించడంతో దాదాపు రెండు కిలోమీటర్లు ట్రాఫిక్ స్థంభించిపోయింది. ఆంక్షల పేరుతో సంఘీభావం తెలుపుతున్న తమను అడ్డుకుంటున్నారని రైతులు మండిపడ్డారు. పాదయాత్రలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు సైతం పాల్గొన్నారు.