అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi ) మంగళవారం తిరుపతిలో జిల్లాలో నెలకొల్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఐసర్ ప్రాంగణాలను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు . అదేవిధంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ని కూడా ప్రారంభించారు. కర్నూలు ట్రిపుల్ ఐటీ(Triple IT) ని జాతికి అంకితమిచ్చారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా వీటిని ప్రారంభించారు.
విశాఖ ఐఐఎం(IIM)కు సంబంధించి 2016 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్ నిర్వహిస్తున్నారు. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో స్థలం కేటాయించి మొదటి దశ శాశ్వత భవనాలను ఇటీవల పూర్తి చేశారు. తిరుపతి జిల్లా ఏర్పేడుకు సమీపంలోని ఐఐటీ, శ్రీనివాసపురంలోని ఐసర్ భవనాలను పూర్తి చేశారు.
నిజామాబాద్లో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ సముదాయాన్ని సైతం ఆయన ప్రారంభించారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్టును జాతికి అంకితం ఇవ్వడంతోపాటు పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.