Srisailam | శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ర్టాల భక్తులే కాకుండా ఉత్తర దక్షిణాది రాష్ర్టాల నుండి కూడా వేలాదిగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచి స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండి అలంకార దర్శనాలు చేసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ముడుపులు చెల్లించేందుకు వస్తున్న శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి మాల విరమణ ఇరుముడి సమర్పణలు చేయిస్తున్నారు. శివదీక్షా శిబిరాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కూడా అర్చకులు దీక్షా విరమణలు చేయిస్తున్నారు. కాగా, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు స్వయంగా పట్టువస్ర్తాలు, ఫలపుష్పాదులను సమర్పించారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం తరఫున చైర్మెన్ కె. రాంబాబు, ఈవో కెఎస్ రామారావు పట్టు వస్త్రాలను సమర్పించారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా క్షేత్ర ప్రధాన ప్రాంతాలతోపాటు పాతాళగంగ వద్ద పుణ్యస్నానాల కోసం ఏర్పాటు చేసిన జల్లుస్నాన ఘట్టాలను, పార్కింగ్, టోల్గేట్, ఉద్యానవనాలను ఈవో పెద్దిరాజు పరిశీలించారు. యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను దుర్వినియోగపరచకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా ఉంచాలని కోరారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు నిలిపివేసినప్పటికీ యాత్రికుల శ్రేయస్సు దృష్ట్యా నది ఒడ్డున ప్రత్యేక శిక్షణ పొందిన గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేవస్థానం నిర్వహించే అన్నదాన భవనంలో అల్పాహార భోజన సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.
అలరిస్తున్న కళారాధనలు ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన కళారాధన వేదికతోపాటు పుష్కరిణి, నిత్యకళావేదిక, శివదీక్షా శిబిరాల్లో భూ కైలాస్ హరికథా గానం, శివపార్వతుల కథాగానం, సత్య హరిశ్చంద్ర నాటికలతోపాటు కూచిపూడి, భరత నాట్య కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.