తిరుమల : కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండడం, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండడం పట్ల టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇకపై తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ గానీ దర్శననానికి 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటే తమ వెంట తీసుకురావాలని సూచించింది.
భక్తులను అలిపిరి వద్దే నిఘా, భద్రతా సిబ్బంది తనిఖీ చేసి సర్టిఫికెట్లు ఉన్న భక్తులను మాత్రమే కొండ పైకి అనుమతి ఇస్తామని టీటీడీ అధికారులు శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తులు, టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది సహకరించాలని కోరారు. అనుబంధ ఆలయాల్లోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది..