అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తన సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. తనకు ప్రాణహాని ఉన్నదని చెప్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. తమ కుటుంబం నక్సలైట్లతో ఇబ్బందులు ఎదుర్కొన్నది, అందుకని తమకు గన్ లైసెన్స్ ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం చెవికి ఎక్కడం లేదన్నారు.
జగన్ ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన కీలక విషయాలను ప్రస్తావిస్తున్నానని తనను టార్గెట్ చేశారని పయ్యావుల కేశవ్ తెలిపారు. దీనిలో భాగమే తన భద్రతను తప్పించడమని, ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి ముందుగానే తనతో చెప్పారన్నారు. తనపై కేసులు పెట్టాలని కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాదని ఆరోపణలు చేశారు. తనకు ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీ సిబ్బంది హైదరాబాద్లో ఉండకూడదంటూ గత మూడు నెలలుగా విచిత్ర వాదనను తెరపైకి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్నవారికి గన్మెన్ ఇవ్వమంటున్న జగన్ సర్కార్.. వైసీపీ నేతల విషయంలో మాత్రం నిబంధనలు మార్చుతున్నారని చెప్పారు.
గన్ లైసెన్స్ అంశాన్ని నాలుగు నెలలుగా పెండింగులో పెట్టారని పయ్యావుల కేశవ్ అన్నారు. తమ కుటుంబానికి నక్సలైట్ టార్గెట్లు ఉన్నాయని.. తన నియోజకవర్గంలో మిలిటెంట్ల కదలికలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గన్మెన్లను తొలగించడం, గన్లైసెన్స్ ఇవ్వకుండా నాన్చడం, సెక్యూరిటీ సిబ్బంది కేటాయింపులో ఇబ్బందులు పెడుతున్నారని ఆయన వాపోయారు. తనకు ఏదైనా జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. తన కారణంగా ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నందునే తనపై ఇలా కక్ష గట్టారని ఆరోపించారు. తాను పోరాటాల్లో పుట్టి పెరిగినవాడినని.. ప్రభుత్వం బెదిరింపులకు భయపడేది లేదన్నారు. సెక్యూరిటీని పెంచాలని అడిగిన మరుసటిరోజునే గన్మెన్లను మార్చడం దేనికి సంకేతాలని పయ్యావుల ప్రశ్నించారు.