అమరావతి: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని పవన కళ్యాణ్ అన్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ లేకుండా దయచేసి బయటకు రావొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అందరూ భౌతిక దూరం పాటించాలని, వృద్ధులు,దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
దేశంలోను, తెలుగు రాష్ట్రాలలో నమోదవుతున్న కోవిడ్ రోగుల గణాంకాలు ఆందోళనకరంగానే వున్నాయి. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే ఆరోగ్య సిబ్బంది ముఖ్యంగా డాక్టర్లు, వైద్య సహాయకులు, వైద్య విద్యార్థులతోపాటు పోలీసులు, స్థానిక సంస్థల సిబ్బంది, మీడియా ఉద్యోగులు అధిక సంఖ్యలో కోవిడ్ బారినపడుతున్నారని వస్తున్న వార్తలు విచారం కలిగిస్తున్నాయని అన్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయవేత్తలు కూడా కోవిడ్ బారినపడుతుండడం దీని తీవ్రతను తెలియచేస్తోందని పవన్ పేర్కొన్నారు