అమరావతి: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం విడుదల కానుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఏపీలో నిరసనలు తెలియజేస్తున్నారు. పవన్ అభిమానులు తిరుపతిలో గాంధీ విగ్రహం కూడలి వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఆంక్షలు సరికాదంటూ నినాదాలు చేశారు. ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి ఎలాంటి అదనపు షోలు వేయకూడదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని థియేటర్లకు ఆదేశాలు జారీచేసింది. బెనిఫిట్షోలు వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జీవో 35 ప్రకారమే అమలు చేయాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని సూచించింది. ఈమేరకు కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరులో థియేటర్లకు తహశీల్దార్ నోటీసులు ఇచ్చారు.