న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తాకిడితో ఉక్కిరిబిక్కిరవుతున్న భారత్ కు ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. రోజూ మూడు లక్షలకు పైగా తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంచ, ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్న క్రమంలో పలు దేశాలు సంక్షోభ సమయంలో తామున్నామని భరోసా ఇస్తూ ముందుకొచ్చాయి. కొవిడ్ కేసుల పెరుగుదలతో సతమతమవుతున్న భారత్ కు అవసరమైన తక్షణ సాయం అందిస్తామని అమెరికా పేర్కొంది.
మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమయ్యే వైద్య పరికరాలు పంపుతామని వైట్ హౌస్ ప్రతినిధి వెల్లడించారు. ఇక పీపీఈ కిట్లు, థెరాప్యుటిక్స్, ర్యాపిడ్ పరీక్షల కిట్లు, వెంటిలేటర్లను వెంటనే పంపుతామని తెలిపారు. భారత్ లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడిపదార్ధాలను సరఫరా చేసేందుకూ అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
భారత్ తో వ్యాక్సిన్లను పంచుకునేందుకూ అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇక బ్రిటన్ భారత్ కు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, వెంటిలేటర్లు సహా 600కు పైగా వైద్య పరికరాలను పంపుతోంది. మహమ్మారి వ్యాప్తితో సతమతమవుతున్న భారత్ కు వైద్య పరికరాలను ఇప్పటికే పంపామని, కొవిడ్ పై పోరులో భారత్ కు బ్రిటన్ అన్నిరకాలుగా చేదోడుగా ఉంటుందని బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ పేర్కొన్నారు.
మహమ్మారి వ్యాప్తితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్ కు బాసటగా ఆక్సిజన్ సంక్షోభం అధిగమించేందుకు సాయం చేస్తామని ఫ్రాన్స్ స్పష్టం చేసింది. విపత్తు వేళ భారత్ కు పూర్తిగా అండగా నిలుస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయేల్ మాక్రన్ పేర్కొన్నారు. ఇక, భారత్ పంపిన కొవిడ్-19 వ్యాక్సిన్లను అందుకున్న దేశాలన్నీ ప్రస్తుతం మహమ్మారి వ్యాప్తితో బాధపడుతున్న భారత్ కు బాసటగా నిలుస్తాయని ఆప్ఘనిస్తాన్ పేర్కొంది.