Srisailam | ఈ రోజు అమావాస్య కావడంతో శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీబయలు వీరభద్రస్వామికి గురువారం సాయంత్రం విశేష అర్చన నిర్వహించినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో ఈ విశేష అర్చన జరిపిస్తున్నట్లు చెప్పారు. అమావాస్య నాడు భక్తులు కూడా శ్రీబయలు వీరభద్రస్వామికి పరోక్ష సేవ జరిపించే అవకాశం కల్పించింది శ్రీశైలం దేవస్థానం. ఈ పరోక్ష సేవ ద్వారా గురువారం 18 మంది భక్తులు ఈ విశేష పూజలు జరిపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా ఈ పూజలు జరిపించారు.
ఈ పూజాధికాలు నిర్విఘ్నంగా సాగేందుకు ముందుగా మహా గణపతి పూజ నిర్వహించారు. ఈ పూజాధికాల్లో పంచామ్రుతాలు, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో శ్రీబయలు వీరభద్రస్వామికి అభిషేకం నిర్వహించారు. ఈ స్వామిని ఆరాధించడం వల్ల గ్రహ దోషాలు నివారించబడి, అరిష్టాలన్నీ తొలగి పోతాయని ఎటువంటి క్లిష్ట సమస్యలైనా పరిష్కారం అవుతాయని, ప్రమాదాలు నివారించబడుతాయని, సర్వ కార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.
శ్రీబయలు వీరభద్రస్వామికి పరోక్ష సేవ జరిపించే భక్తులు ఆన్లైన్లో రూ.1,116 సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు సేవా రుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.govt.in ద్వారా చెల్లించవచ్చు. కాగా, ఈ పరోక్ష సేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించడానికి వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం తదితర వివరాలు ఎప్పటికప్పుడు సేవా కర్తలకు దేవస్థానం తెలియజేస్తుంది.
సేవాకర్తలతోపాటు భక్తులంతా శ్రీబయలు వీరభద్రస్వామికి పరోక్ష సేవా కార్యక్రమాన్ని శ్రీశైల టీవీ / యూ-ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు. కనుక భక్తులంతా ఈ పరోక్ష సేవను సద్వినియోగం చేసుకోవాలని ఈఓ పెద్ది రాజు కోరారు. ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్రంలో 83339 01351 / 52 / 53 / 54 / 55 / 56 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.