తిరుమల : శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు టీటీడీ దర్శనం(TTD Darshan) , అన్నప్రసాదాలు, గదులు తదితర సౌకర్యాలను కల్పిస్తోందని బ్రిజ్లాల్ అధ్యక్షతన గల భారత హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (Parliamentary Committee) అభినందించింది. కమిటీ సభ్యులు మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో ఎవి.ధర్మారెడ్డి టీటీడీ ఆవిర్భావం నుంచి చేపడుతున్న వివిధ సామాజిక, ధార్మిక, సంక్షేమ కార్యకలాపాలను 40 నిమిషాల ఆడియో విజువల్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కమిటీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామివారి దర్శనం గొప్ప అనుభూతిని మిగిల్చిందన్నారు. శ్రీవారి దర్శనం కోసం వస్తున్న యాత్రికులను, తిరుమల పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ చేపడుతున్న భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ పద్ధతులు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, విపత్తుల నిర్వహణ ప్రణాళికలను ప్రశంసించారు.
కమిటీ సభ్యులు బిప్లవ్ కుమార్ దేవ్, నీరజ్ శేఖర్, దిలీప్ ఘోష్, దులాల్ చంద్ర గోస్వామి, రాజా అమరేశ్వర నాయక్, డాక్టర్ సత్యపాల్ సింగ్, డాక్టర్ నిషికాంత్ దూబే, హోం వ్యవహారాల శాఖకు చెందిన ఇతర అధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.