అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 206 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ కోసం 609 మంది ఎన్నికల అధికారులు, 1047 మంది సహాయ ఎన్నికల అధికారులను నియమించారు.
మొత్తం 652 జడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమవగా, 515 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా 11 మంది అభ్యర్థులు మృతిచెందారు. అదేవిధంగా 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వివిధ కారాణాలతో 375 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మొత్తం 9672 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రకటన వెలువడింది. ఇందులో 2371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7220 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 18,782 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నామినేషన్ అనంతరం పోటీలో ఉన్న 81 మంది అభ్యర్థులు మృతిచెందారు.
గుంటూరు జిల్లాలో 571 ఎంపీటీసీ, 45 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, విజయనగరం జిల్లాలో 31 జెడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలు, తూర్పుగోదావరి జిల్లాలో 61 జడ్పీటీసీ, 1000 ఎంపీటీసీ, పశ్చిమగోదావరి జిల్లాలో 45 జెడ్పీటీసీ, 781 ఎంపీటీసీ, ప్రకాశం జిల్లాలో 41 జెడ్పీటీసీ, 367 ఎంపీటీసీ, చిత్తూరు జిల్లాలో 33 జడ్పీటీసీ, 419 ఎంపీటీసీ, కడప జిల్లాలో 12 జెడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు, అనంతపురం జిల్లాలో 781 ఎంపీటీసీ, 62 జడ్పీటీసీ, కర్నూలు జిల్లాలో 37 జెడ్పీటీసీ, 495 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.