తిరుపతి : భారీ వర్షాలతో స్వామి వారిని దర్శించుకోని భక్తుల కోసం తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనానికి అవకాశాన్ని కల్పించింది. ఈనెల 18 నుంచి 30 వ తేదీ వరకు టికెట్లు బుకింగ్ చేసుకుని, వర్షాల కారణంగా దర్శనానికి రాని భక్తుల కోసం దర్శన టికెట్టు మార్చుకునే అవకవాశం కల్పించింది . టీటీడీ వెబ్సైట్లో దర్శన తేదీని మార్చుకోవడంతో పాటు.. నూతన టికెట్లను పొందే అవకాశం కల్పిస్తున్నామని టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
పాత దర్శనం టికెట్లతో ఆరునెలలలోపు ఎప్పుడైనా నూతన టికెట్టు పొందవచ్చని వివరించారు. కాగా ప్రస్తుతం వర్షబీభత్సం తగ్గిందని, తిరుమలకు చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. రెండు ఘాట్ రోడ్లలో వాహనాలను అనుమతిస్తున్నామని, శ్రీవారి మెట్ల మార్గం నాలుగు ప్రాంతాలు దెబ్బతిన్నాయని, అలిపిరి నడక మార్గంలో ఎలాంటి నిర్మాణాలు దెబ్బతినలేదని ఆయన తెలిపారు.