అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట (Vontimitta) శ్రీకోదండరామయ్య కల్యాణానికి సిద్ధమయ్యాడు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు పండు వెన్నెల్లో భక్తజనుల సమక్షంలో రాముల వారు సీతమ్మను కల్యాణమాడనున్నాడు. రాములోరి పెండ్లికి శ్రీకోదండరామాలయం శోభాయమానంగా ముస్తాబైంది. శ్రీరాముడు చంద్రుడికి ఇచ్చిన వరాన్ని అనుసరించి రాత్రివేళ వివాహం జరిపించడం ఆనవాయితీగా వస్తున్నది. కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. 50 వేల మంది వీక్షించేలా సౌకర్యాలు కల్పించింది. తిరుమల నుంచి వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో కల్యాణం జరుగనుంది.
కోదండరాముడి కల్యాణానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కల్యాణానికి దాదాపు లక్షమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.