అమరావతి : ఏపీ ప్రభుత్వ జీవో 35కు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లి జీవోను సస్పెండ్ చేయించిన సినిమా థియేటర్ల యాజమాన్యాలపై వైసీపీ ప్రభుత్వం ప్రతికార చర్యలకు పాల్పడుతుంది. రెండు రోజులుగా ఏపీలో సినిమా థియేటర్లపై అధికారులు పలు కారణాలతో తనిఖీలు, దాడులు చేస్తుండడంతో థియేటర్ల యాజమనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణాజిల్లా, విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా థియేటర్లను నిర్వహిస్తున్నారని జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 15 థియేటర్లను సీజ్ చేశారు. బుధవారం కృష్ణా జిల్లా విజయవాడలో జేసీ మాధవీలత ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగాయి. నగరంలోని గాంధీనగర్ లో జయరాం థియేటర్లో సినిమా టికెట్ల ధరలు, ఫైర్ సేఫ్టీ సదుపాయాలను ఆమె తనిఖీ చేశారు. కొవిడ్ ప్రొటోకాల్స్ను పాటిస్తున్నారా? లేదా? అనే విషయాలపై ఆరా తీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రేక్షకులకు థియేటర్లలో సౌకర్యాలపై ఆరా తీయడం, కొవిడ్ నిబంధనల పేరిట తనిఖీలు చేపట్టడం పట్ల ఏపీ థియేటర్ల ఎగ్జిబిటర్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై రేపు విజయవాడలో సమావేశం కావాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో తనిఖీలు, హాల్స్సీజ్, ప్రభుత్వ తీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల జనాభా ప్రకారం ధరలు నిర్ణయించేందుకు ప్రభుత్వం జీవో 35ను విడుదుల చేసింది. ఈ జీవోపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తు సినిమా థియేటర్లు హైకోర్టుకు వెళ్లగా సినిమా థియేటర్లకు అనుకూలంగా ప్రభుత్వ జీవోను కొట్టివేసింది