అమరావతి : అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతుంది. వరద కారణంగా సాలచింతల గ్రామం జల దిగ్భందంలో చిక్కుకుంది. వరదలో చిక్కుకున్న 150 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. పాలిటెక్నిక్ కాలేజీలో చిక్కుకున్న 60 మంది విద్యార్థులను రక్షించారు. ఇంకా 30 గ్రామాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. వరద కారణంగా రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ-చెన్నై , అనంతపురం- తాడిపత్రి మార్గాలోన్లూ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పుట్టపర్తిలో భారీ వర్షం కురియడంతో పలుచోట్ల విద్యుత్కు అంతరాయం కలిగింది. అనంతపురం కదిరిలో ఇళ్లు కూలిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా తొమ్మిది మందికి గాయాలయ్యాయి. అనంతసాగరం చెరువుకు స్వల్పంగా గండి పడింది. పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేశ్ కడప జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారు. కడప చరిత్రలో ఇంతపెద్ద వరద ఎప్పుడూ లేదని ఆయన పేర్కొన్నారు.