అమరావతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. కొవిడ్ కారణంగా ఇళ్లకే పరిమితమైన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు నిన్న తిరుమల కొండకు చేరుకున్నారు. 73,358 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా వీరిలో 41,900 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.11 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
29 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచిఉన్నారని వీరికి 9 గంటల్లో దర్శనం అవుతుందని వెల్లడించారు. కాగా హనుమజ్జయంతిని పురస్కరించుకుని నిన్న ఆకాశగంగ, జపాలి తీర్థంలో నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు అలరించాయి. ఉదయం ఆకాశగంగలోని శ్రీ అంజనాదేవి, శ్రీఆంజనేయ స్వామి వారికి నిర్వహించిన స్నపనతిరుమంజనం కార్యక్రమంలో ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. నాదనీరాజనం వేదికపై సాయంత్రం 4 గంటలకు “వీరో హనుమాన్ కపిః” అనే అంశంపై డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ మాట్లాడారు.